**మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు**

బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. కూచ్‌బిహార్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె ఈ ఆరోప‌ణ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు. బీజేపీ నుంచి ఓ మైనార్టీ రాజ‌కీయ పార్టీ డ‌బ్బులు తీసుకుంటున్న‌ద‌ని, అది హైదారాబాద్‌కు చెందిన‌ద‌ని, బెంగాల్ పార్టీ కాద‌ని మ‌మ‌తా అన్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీపై దీదీ ఆ విమ‌ర్శ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. త‌న‌పై దీదీ విమ‌ర్శ‌లు చేయ‌డ‌మంటే.. బెంగాల్‌లో ఎంఐఎం పార్టీ త‌న ద‌ళాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లే అని ఓవైసీ అన్నారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ త‌న భ‌యాన్ని, ఆందోళ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఓవైసీ తెలిపారు. ఎంఐఎం పార్టీ ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. బీహార్‌లోని కిష‌న్‌గంజ్ అసెంబ్లీ సీటును ఆ పార్టీ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ది. హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రి గురించి బెంగాల్ దీదీ భ‌య‌ప‌డితే.. మ‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 సీట్ల‌ను ఎలా గెలిచింద‌ని ఓవైసీ ప్ర‌శ్నించారు. కూచ్‌బీహార్‌లో ఉన్న మ‌ద‌న్ మోహ‌న్ ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల మ‌మ‌తా బెన‌ర్జీ సంద‌ర్శించారు. దీంతో ఆమె హిందూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న‌ట్లు కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి


Popular posts